23, ఫిబ్రవరి 2011, బుధవారం

పూవై విరిసిన...



కేవలం..బేలా అన్న ఆ ఒక్క మాట కోసం ఈ పాటని కొన్ని వేల సార్లుగా వింటూనే వున్నాను..అంటే నమ్ముతారా..? అతిశయోక్తిలా అనిపిస్తోంది కదూ..కానీ అక్షరాలా నిజం. 

చాలా కాలం క్రితం టీవీ లో ఒక లైవ్ షో లో ఈ పాట విన్నాను(చూశాను). ఆ తరువాత కనిపించిన ప్రతీ చిన్న, పెద్ద మ్యూజిక్ స్టోర్ లు వెతికాను పిచ్చిగా...చివరికి సంగీత్ సాగర్ లో "గోల్డెన్ హిట్స్ అఫ్ ఘంటసాల" లో పట్టుకున్నాను. అప్పటినించీ మనసారా..తనివి తీరా విన్నాను..వింటూనే వున్నాను..ఆనందిస్తూనే వున్నాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అక్క భర్త సి.హెచ్.సురేష్ అని బ్యాంకు ఉద్యోగి..ఘంటసాల గారి పాటలు, మాధవపెద్దిగారి పాటలు (అందుకే ఈయన మాధవ పెద్ది గారి కుటుంబానికి చాలా సన్నిహితుడయ్యాట్ట) టీవీ లలో, స్టేజి షో లలో పాడుతూ వుంటారు.. మొన్నామధ్య కాస్త తీరికగా కనిపిస్తే అడిగి పాడించుకున్నాను ఈ పాట. అద్భుతంగా పాడారు. నాకీ పాట ఎందుకిష్టమో చెప్తే విని ఆశ్చర్య పోయారు అలా కూడా ఉంటారా (వింటారా) అంటూ..


సుతి మెత్తగా..మృదు మధురంగా సాగే ఈ పాట..శ్రీ తిరుపతమ్మ కధ సినిమాలోనిది. సి. నారాయణరెడ్డి గారు రాసి శంకర్ , పామర్తి గార్లు సంగీతాన్ని అందించగా..మనకోసమే గంధర్వ లోకం నించి వచ్చి తన గళం తో పాటల పూలు పూయించి తిరిగి అదే లోకానికి వెళ్ళిపోయిన ఘంటసాల గారు పాడగా విరిసిన పువ్విది. 






పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా..!!పూవై!! 


చల్లని గాలులు సందడి చేసే..
తోలి తోలి వలపులు తొందర చేసే..
జలతారంచుల మేలిముసుగులో 
తలను వాల్తువేలా..బేలా..!!పూవై!!



మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఆ..ఆ..ఆ..
తెలిసెనులే నీ తలపులేమిటో...
తొలగిపోదువేలా...బేలా !!పూవై!!



తీయని వలపుల పాయసమాని..
మాయని మమతల ఊయలలూగి..
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా!!పూవై!!



16, ఫిబ్రవరి 2011, బుధవారం

నేనే రాధనోయి..గోపాలా..



డా!! భానుమతి..బహుముఖ ప్రజ్ఞాశాలి. రచన, నటన, గానం అన్నింటిలో ఆవిడది ఒక ప్రత్యేక శైలి. సినిమాల్లో ఆవిడని చూస్తే గర్విష్టి అని , డామినేట్ చేసేస్తుందని అనిపించడం కద్దు. కానీ భానుమతి గారి ఆత్మ కధ  "నాలోనేను " ఆవిడ అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించేస్తుంది.


నాకు భానుమతిగారి అన్ని పార్శ్వాలు నచ్చినా..ఆవిడ రచనలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. విశిష్టమైన కంఠస్వరం..అందులో పలికే అద్భుతమైన గమకం..గొప్ప స్వరజ్ఞానం.. ఆవిడకే ప్రత్యేకం. అంతా మనమంచికే అన్న సినిమాలోని ఈ పాట చాలా అద్భుతంగా పాడారావిడ. 



ఈ పాట కి సంగీతం భానుమతి, సత్యం గారు సమకూర్చారట. పాట చివర్లో ఆలాపన హిందుస్తానీ ఆలాపనని గుర్తు చేస్తుంది. పండిట్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి తో ఇన్స్ పైర్ అయ్యి చేసిన పాట అని శైలజ గారు జీ తెలుగు లో చెప్పగా విన్నాను. నాకెంతో ఇష్టమైన ఈ పాట మీరందరూ కూడా విని ఆనందించాలని నా కోరిక.



ఇంకో విశేషమేంటంటే..జీ తెలుగు స రి గ మ నువ్వా నేనా..లో సాహితి అనే అమ్మాయి (10 ఏళ్ళు ఉంటాయేమో) అద్భుతంగా పాడింది. అంత చిన్న వయసు లో ఆ పాట సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటే..అద్భుతంగా పాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో కూడా అటాచ్ చేశాను. చూస్తారుగా..








నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..!!నేనే!!

విరిసిన పున్నమి వెన్నెలలో...
చల్లని యమునా తీరములో...
నీ పెదవులపై వేణు గానమై...
పొంగి పోదురా... నేనే వేళా...!!నేనే!!

ఆడే పొన్నల నీడలలో...
నీ మృదు పదముల జాడలలో...
నేనే నీవై...నీవే నేనై...కృష్ణా...ఆ...ఆ...ఆ...
అనుసరింతురా నేనే వేళా..!!నేనే!!











1, ఫిబ్రవరి 2011, మంగళవారం

గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా..


ఏ మహానుభావుడు రాశాడో ఇంత మంచి తత్వాన్ని, ఇంత గొప్ప సత్యాన్ని.  రెప్పపాటు జీవిత కాలం లో...నా అంత వీరుడు లేడని గొప్పలు పోతాం... అంతా నా ప్రతిభే...అన్నీ నా సొంతమే అనుకుంటాం.  శరీరమనే ఈ గూటి నించి ప్రాణమనే రామచిలుక ఎగిరిపోయాక...  కేవలం స్మృతి గా మిగిలిపోతాం. 

ఎంత వద్దనుకున్నా..ఈ మధ్యకాలంలో నేను కోల్పోయిన బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల జ్ఞాపకాలు విపరీతంగా బాధ పెడుతున్నాయ్.  జీవితం  క్షణ  బంగురం  అని అనుకునే  స్థితప్రజ్ఞత  ఎప్పుడొస్తుందో..







గూడు చిన్న బోయెరా..చిన్నన్నా గూడు చిన్న బోయెరా..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!

ఎక్కలేని పర్వతాలు..వేయి నూర్లు నిచ్చెనేసినా..
ఎక్కడ చూచినా గానీ చిలక జాడ కాన రాదు..!!గూడు!!

పంచ పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చినా..
మాణిక్యం చేతికిచ్చినా మాటలాడదు రామ చిలుక !!గూడు!!

కొండ మీద బండి వాలేను..గుండె రెండు చెక్కలాయెను..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!