1, ఫిబ్రవరి 2010, సోమవారం

ఎవ్వరో పాడారు భూపాల రాగం



"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై...." ప్రభాతవేళ...పక్షుల కిలకిల రావాలతో ప్రకృతికి మేలుకొలుపు పాడుతున్న వేళ... ఈ భూపాల రాగం వింటూంటే అమృత ధారలలో  తడుస్తున్న అనుభూతి.  సాయం సంధ్య వేళ పశుపక్షాదులు తమ తమ నెలవులు చేరే వేళ విన్నా అదే అనుభూతి..అమృత ధారల్లో తడుస్తున్నట్టు. ఆ  గొప్పదనం పాటలోని మాటలదా..? రాగానిదా..? పాడిన గాత్రానిదా..? అని అనుకుంటే, ఆ  అతిరధులు ముగ్గురూ కలిసి సంగీత సాగరాన్ని మధించి వెలికి తీసిన ఆణిముత్యానిది. 


కోకిలమ్మ వినికిడి శక్తి లేని అమ్మాయి, ఒక అనాధ. ఐదారు వాటాలు(కాపురాలు) వున్న ఒక ఇంట్లో ఒక మూల చిన్న గది (వసారా) లో ఆమె నివాసం. ఆ  ఇంట్లో ఉంటున్న వారు చెప్పిన పని చేసి వారిచ్చిన డబ్బుతో జీవిత సాగిస్తూ వుంటుంది.  రాజు ఒక డిగ్రీ చదువుకున్న నిరుద్యోగి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్క ఒక బండి మీద సంచార లాండ్రీ దుకాణం నడుపుతూంటాడు. కోకిలమ్మ ఉంటున్న ఇంటి పరిసరాల్లోనే అతని దుకాణం వుండడం చేత ఇద్దరికీ పరిచయం జరగడం, అది ప్రేమగా మొగ్గ తొడగడం  తొందరగానే జరిగిపోతుంది. 


అప్పుడప్పుడు కూనిరాగాలు తీసే రాజుకి సంగీతం పట్ల ఆసక్తిని గమనించి, తను ఉంటున్న ఇంట్లోనే పైన పోర్షన్ లో ఉంటున్న రేడియో స్టేషన్ లో పనిచేసే అయన (పేరు గుర్తులేదు) దగ్గర సంగీతం నేర్చుకునే ఏర్పాటు చేస్తుంది. అతని చేత లాండ్రీ పని మాన్పించి, అతని పోషణ భారం తాను  చూస్తుంది.  అతని శ్రద్ధ, సాధన, ఆమె శ్రమ ఫలించి అతను సంగీతంలో నిష్ణాతుడవుతాడు.      


ప్రతీ రోజూ గుడిలో పాడే అతని గాత్రానికి ముగ్దురాలైన స్వప్న అనే అమ్మాయి తన అన్నగారితో చెప్పి అతనికి వేదిక మీద పాడే అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశం ఒక గాయకుడిగా అతనికి మంచి పేరు తెస్తుంది, .అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఆ  తరువాత  సంగీత సాగరంలో అతని ప్రయాణం ఎలా సాగింది? మనసిచ్చి, అతని జీవితాన్ని తీర్చి దిద్దిన కోకిలమ్మ ఏమైంది? అనేది ఈ కోకిలమ్మ సినిమా లో కధాంశం. రాజు గాయకుడిగా మొదటి సారి వేదిక మీద పాడిన పాటే ఈ "ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై.."


బాల చందర్ గారు తీసిన ఈ సినిమాకి...ఆచార్య ఆత్రేయ గారు పాటలు రాయగా, ఏం.ఎస్.విశ్వనాథన్ గారు స్వరపరచి, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారూ, పీ. సుశీల గారూ పాడిన ఈ సినిమాలోని నాలుగు పాటలూ ఆణిముత్యాలే. అందులో నాకు నచ్చిన ఈ పాటలో రెండు చరణాల్లోనూ... మొదటి వాక్యం మినహాయించి మిగతా చరణమంతా పాటలా కాక మాటల్లో చెప్పడం ఈ పాట ప్రత్యేకత. 


నాకెంతో నచ్చిన ఈ పాట మీ అందరితో పంచుకోవాలనిపించి నే చేసిన చిన్ని ప్రయత్నమిది. నా ఈ ప్రయత్నం లో పొరపాట్లు, తప్పులు ఏవైనా దొర్లితే మన్నించమని ప్రార్ధన. కింద ఇచ్చిన లింకు లో ఈ పాట వినవచ్చు. 


"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..
కనుగొంటినీ ఆ దేవినీ...అబినందనం..అబినందనం..అభినందనం.
వాణియై నాకు బాణీయై ఏ దయ నా హృది మీటెనో..
ఆ మూర్తికీ  స్త్రీ మూర్తికీ  అభినందనం..అభినందనం..అభినందనం.

ఉషోదయాన  కాంతి తానై తుషార బిందువు నేనై..సప్త స్వరాల హరివిల్లునైతీ...
"ఆ కాంతికి నా రాగమాలిక నర్పిస్తున్నా...మీ అందరి కరతాళ హారతులర్దిస్తున్నా..
నేడే అర్చన సమయం...నా నవ జీవన ఉదయం...
యెదలో మమతా గీతం...గుడిలో ఘంటానాదం...
ఇది నా తోలి నై..వేద్యం..." !!ఎవ్వరో!!

వసంత కాల కోకిలమ్మా..జన్మాంతరాల ఋణమా..నీ ఋణమేరీతి చెల్లింతునమ్మా..
"నా జీవితమే ఇక నీకు పదపీఠం...నీ దీవెనలే నాకు మహా ప్రసాదం..
నేడే నా స్వర యజ్ఞం...నేడే ఆ శుభ లగ్నం...
తోలి నే చేసిన భాగ్యం...మదిలో మెదిలే రాగం...
ఇక నా బ్రతుకే...ధన్యం...!!ఎవ్వరో!! "

http://www.youtube.com/user/chanaktheright